చంద్రబాబు, వైఎస్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రులుగా తెలంగాణ వాళ్లే ఉండేవాళ్లు: సోము వీర్రాజు

  • తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలు
  • నేతల మధ్య మాటల యుద్ధం
  • స్పందించిన ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు
  • ఏపీకి చాలా నష్టం జరిగిందని వ్యాఖ్య  
జల వివాదాల అంశం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడైనా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడైనా తెలంగాణకు చెందినవాళ్లే నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్నారని వివరించారు. ప్రాజెక్టుల విషయంలో, నీటి విషయంలో తెలంగాణకే లబ్ది చేకూరేలా, ఏపీ ప్రభుత్వంపైనా, ఏపీ నేతలపైనా తెలంగాణ వాళ్లు ఒత్తిడి తెస్తూ ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నారని సోము వీర్రాజు తెలిపారు. ఇప్పటికే చాలా నష్టపోయామని వెల్లడించారు.

తెలంగాణకు మూడు మండలాలు త్యాగం చేశామని, భద్రాద్రి రాముడ్ని సైతం తెలంగాణకు వదిలేశామని వీర్రాజు అన్నారు. గతంలో దుమ్ముగూడెం టెయిల్ పాండ్ ఉన్న మండలాన్ని తెలంగాణకు ఇచ్చేశారని, ఈ మండలం ఏపీలో ఉండుంటే రాయలసీమకు ఎంతో మేలు జరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకమీదట నీటి కేటాయింపుల విషయంలో ఏపీకి అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.

Somu Veerraju
Water Disputes
Andhra Pradesh
Telangana
Chandrababu
YSR
Irrigation

More Telugu News